ఆయన ఆఖరి కోరిక అదేనని తెలుసుకోలేకపోయాను... మీడియా ముందు బోరున విలపించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి భార్య!

  • ఈ ఉదయం కన్నుమూసిన జయప్రకాశ్ రెడ్డి
  • పిల్లలతో మాట్లాడాలని కోరి, తరువాత మాట్లాడతానన్న జయప్రకాశ్
  • బాత్ రూమ్ కు వెళ్లి తిరిగి రాలేదన్న భాగ్యలక్ష్మి
టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి, ఈ ఉదయం కన్నుమూసిన వార్త, మొత్తం తెలుగు సినీ ప్రేక్షక లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఎలా మరణించారన్న విషయమై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయమై ఓ టీవీ చానెల్ జయప్రకాశ్ భార్య భాగ్యలక్ష్మిని ప్రశ్నించింది.

దీనికి ఆమె సమాధానం ఇస్తూ, "ఆయన తెల్లవారుజామున 3.30 గంటలకు లేచారు. ఎక్కడా ఏమీ నొప్పి పుడుతోందని కూడా చెప్పలేదు. పిల్లలతో మాట్లాడాలి అని అన్నారు. ఇప్పుడే ఎందుకులే... కొంచెం ఆరింటికి అట్లా మాట్లాడుదాము. లేకుంటే మాట్లాడాలని అంటే... చెప్పండి చేసిస్తాను అని అన్నా. వద్దులే బాత్ రూమ్ కు వెళ్లి వచ్చి మాట్లాడుతాను అన్నారు. బాత్ రూమ్ కు వెళ్లారు. ఇక అంతేనండీ..." అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. బిడ్డలతో మాట్లాడాలన్నదే ఆయన ఆఖరు కోరికని తనకు తెలియక పోయిందని, అదే తన తప్పయిందని, ఆయన చివరి కోరికను తీర్చలేకపోయానని ఆమె వాపోయారు.  

ఆయనకు గతంలో హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నా, దానికి చికిత్స తీసుకున్నారని, స్టెంట్లు వేశారని, ఆంజియోగ్రామ్ కూడా తీయించుకున్నారని, అంతా బాగానే ఉందని ఆమె తెలిపారు. బాత్ రూమ్ కు వెళ్లిన ఆయన ఇక తిరిగి రాలేదని ఆమె కన్నీరు పెట్టారు.
 

JayaPrakash Reddy
Bhagyalakshmi
Viral Videos

More Telugu News